ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2022-23 నుంచి 2025-26 వరకు రూ.8,800 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకం– స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ (సిప్)ను కొనసాగించడానికి, పునర్వ్యవస్థీకరించడానికి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా డిమాండ్ ఆధారిత, సాంకేతిక ఆధారిత, పరిశ్రమ–ఆధారిత శిక్షణను ఏకీకృతం చేయడం ద్వారా నైపుణ్యం కలిగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడానికి ప్రభుత్వ నిబద్ధతను తెలియచేస్తుంది.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (పిఎంకెవివై 4.0), ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ (పిఎం–ఎన్ఏపిఎస్), జన్ శిక్షన్ సంస్థాన్ (జెఎస్ఎస్) పథకం– ఈ మూడు ప్రధాన భాగాలను ఇప్పుడు సమగ్ర కేంద్ర ప్రభుత్వ పథకం అయిన “స్కిల్ ఇండియా ప్రోగ్రామ్” కింద కలిపారు. ఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, సామాజిక ఆధారిత విద్యను అందించడం లక్ష్యంగా కలిగి ఉన్నాయి. దీని ద్వారా పట్టణ, గ్రామీణ ప్రజలు, అలాగే అణగారిన వర్గాలు కూడా మెరుగైన వృత్తి విద్యను పొందేలా చేయడమే ఉద్దేశం. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ మూడు అత్యంత ప్రాధాన్య పథకాల కింద, ఇప్పటి వరకు 2.27 కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0:
ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (పి ఎమ్ కె వి వై 4.0) పథకం, 15 నుండి 59 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ (ఎన్ ఎస్ క్యు ఎఫ్ ) కు అనుగుణంగా, షార్ట్–టర్మ్ ట్రైనింగ్ (ఎస్ ఐ టి ), స్పెషల్ ప్రాజెక్ట్స్ (ఎస్ పి ), ముందస్తు అభ్యాస గుర్తింపు (ఆర్ పి ఎల్ ) ద్వారా నైపుణ్యాల పెంపును అందిస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా, పెరిగిన డిమాండ్ తో జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించే విధంగా రూపాంతరం చెందింది. ఈ పథకంలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, స్వల్ప వ్యవధి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో అనుభవాధారిత శిక్షణ (ఒజెటి)ను ఏకీకృతం చేయడం. ఇందువల్ల శిక్షణార్థులు వాస్తవ ప్రపంచ అనుభవం, పరిశ్రమ అనుభవాన్ని పొందగలుగుతారు. పెరుగుతున్న పరిశ్రమ డిమాండ్లు, కొత్త తరం టెక్నాలజీకి అనుగుణంగా, కృత్రిమ మేధ, 5 జి టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ హైడ్రోజన్, డ్రోన్ టెక్నాలజీపై 400 పైగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, భవిష్యత్తు నైపుణ్యాలపై దృష్టి సారించారు.
మిశ్రమ, సౌలభ్యవంతమైన విద్యా నమూనా ఇప్పుడు డిజిటల్ డెలివరీని సమీకరించి, శిక్షణను మరింత సౌలభ్యవంతంగా, విస్తరించగలిగే విధంగా మారుస్తుంది. పరిశ్రమకు అనుగుణమైన లక్ష్యబద్ధమైన నైపుణ్యాలను అందించేందుకు, శిక్షణార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, పునర్నైపుణ్యాన్ని పొందడానికి, అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగి పాత్రలలో ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం 7.5 గంటల నుండి 30 గంటల వరకు వ్యవధి కలిగిన మైక్రో–క్రెడెన్షియల్, నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ (ఎన్ఓఎస్) ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతుంది.
ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి, నాణ్యమైన శిక్షణను విస్తరించడానికి, ఐఐటీలు, ఎన్ఐటీలు, జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్వి), కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్), పిఎం శ్రీ స్కూల్స్, టూల్రూమ్స్, నైలెట్, సిపెట్ వంటి ప్రముఖ విద్యా సంస్థలలో స్కిల్ హబ్ లను ఏర్పాటు చేశారు.
శిక్షణలో నాణ్యత, మూల్యాంకనలను బలోపేతం చేయడానికి, శిక్షణ కేంద్రాల మధ్య ప్రమాణీకరణ, నైపుణ్యాన్ని పెంపొందించేందుకు లక్ష మంది మూల్యాంకనకర్తలు, శిక్షకులతో కూడిన– నేషనల్ పూల్ ను అభివృద్ధి చేస్తున్నారు. పరిశ్రమ భాగస్వామ్యాలు రిక్రూట్, ట్రెయిన్, డిప్లాయ్ (ఆర్ టి డి) శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలకు ప్రవేశాన్ని సులభతరం చేస్తాయి.
ఇంకా ఈ పథకం అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ ప్రయాణాలకు ప్రాముఖ్యతను పెంచుతుంది. దీని ద్వారా భారతీయ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నైపుణ్యాలతో సిద్ధంగా ఉంటారు. మంత్రిత్వ శాఖ వివిధ దేశాలతో మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాలు (ఎంఎంపిఎ), అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. అవసరమైన రంగాలలో నైపుణ్య లోపాలపై అధ్యయనాలు కూడా నిర్వహించింది. ఈ పథకం కింద, మన శ్రామిక శక్తికి అంతర్జాతీయ చలనశీలత అవకాశాలను పెంచడానికి డొమైన్ స్కిల్స్, జాయింట్ సర్టిఫికేషన్లు, భాషా ప్రావీణ్యం, సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణను ప్రారంభించారు.
పిఎంకెవివై 4.0 కింద, అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని ప్రేరేపించేందుకు ‘మొత్తం ప్రభుత్వం’ అనే దృక్కోణాన్ని అవలంబించారు. తద్వారా ఆయా రంగాలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిరవధికంగా అమలు అవుతాయి. ఈ పథకం వివిధ నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకాల లో నైపుణ్య భాగాలను అందిస్తూ, దాని ప్రభావాన్ని, వనరుల సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచుతుంది. ప్రధాన భాగస్వామ్యాల్లో, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన, నూతన, పునరుత్పాదక ఇంధన చెందిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నల్ జల్ మిత్ర మొదలైనవి ఉన్నాయి.
సామర్థ్యాన్ని పెంపొందించడానికి, రంగాల వారీగా నైపుణ్య అంతరాలు, పరిశ్రమ అవసరాలను సమర్థంగా గుర్తించడానికి డిమాండు మదింపు వ్యూహాన్ని పునర్వ్యవస్థీకరించడంతో సహా విధానపరమైన మార్పులు ప్రవేశపెట్టారు. పిఎంకెవివై 4.0 లో ఒక కీలక సంస్కరణ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానం. ఇది షరతుల భారాన్ని గణనీయంగా తగ్గించింది. ఈ పథకంలో భాగస్వామ్యాన్ని మరింత క్రమబద్ధీకరించి, సమర్థవంతంగా మార్చింది.
పీఎం నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (పీఎం–ఎన్ఏపీఎస్):
నేషనల్ పాలసీ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్-2015 భారతదేశంలో నైపుణ్య కార్మిక శక్తిని సృష్టించేందుకు అప్రెంటీషిప్పై ప్రధానంగా దృష్టి పెట్టింది. వాస్తవ ఉద్యోగ ప్రదేశంలో పనిచేసే యువతకు నైపుణ్యాలను అందించేందుకు, కొంత వేతనం సంపాదిస్తూ ఆర్థిక సహాయం పొందేందుకు అప్రెంటీషిప్ శిక్షణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయంగా కూడా, శిక్షణతో నేర్చుకుంటూ సంపాదించే అత్యుత్తమ నమూనాగా అప్రెంటీషిప్ను పరిగణిస్తారు.
ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీషిప్ ప్రమోషన్ స్కీమ్ (పిఎం– ఎన్ఎపిఎస్) విద్య నుండి ఉద్యోగంలోకి నిరవధిక మార్పిడికి మద్దతు ఇస్తుంది. దీని ద్వారా అప్రెంటీస్లు వాస్తవ ప్రపంచ అనుభవం ద్వారా పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాలను సంపాదించగలుగుతారు. భారతదేశంలోని అప్రెంటిస్లు, సంస్థలు రెండింటికీ మద్దతు ఇవ్వడానికి, కేంద్ర ప్రభుత్వం శిక్షణ కాలంలో స్టైపెండ్ లో 25 శాతం అంటే ప్రతి అప్రెంటిస్కు నెలకు రూ.1,500 వరకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అందిస్తుంది. ఈ పథకాన్ని 14 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల కోసం రూపొందించారు. ఇది వివిధ తరగతుల జనాభాలో నైపుణ్య అభివృద్ధి అవకాశాలను సమగ్రంగా పెంపొందిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్ చెయిన్, గ్రీన్ ఎనర్జీ, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలతో సహా ప్రస్తుత తయారీ రంగంలో అప్రెంటిషిప్ అవకాశాలను ఎన్ఎపిఎస్ ప్రోత్సహిస్తుంది. ఇది భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్లు, పరిశ్రమ ధోరణులతో నైపుణ్య కార్యక్రమాలను సమీకృతం చేస్తుంది. చిన్న సంస్థల్లో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), ఆకాంక్షాత్మక జిల్లాలు, ఈశాన్య ప్రాంతం వంటి నిరుపేద ప్రాంతాల్లో ఉన్న అప్రెంటిస్ల నమోదును ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
జన్ శిక్షన్ సంస్థాన్ (జేఎస్ఎస్) పథకం:
జన్ శిక్షన్ సంస్థన్ (జెఎస్ఎస్) పథకం అనేది వృత్తి శిక్షణను అందుబాటులో, సరళమైన, సమ్మిళితంగా చేయడానికి రూపొందించిన సమాజ కేంద్రీకృత నైపుణ్య చొరవ. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ యువత, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలకు ఇంకా 15 – 45 సంవత్సరాల వయస్సు గల వారికి సేవలు అందిస్తుంది. తక్కువ ఖర్చుతో, ఇళ్ల వద్దనే శిక్షణను సౌలభ్యవంతమైన సమయావళితో అందించడం ద్వారా, జెఎస్ఎస్ అవసరమైన వారికి నైపుణ్య అభివృద్ధి అవకాశాలను చేరవేసి, స్వయం ఉపాధి, వేతన ఆధారిత జీవనోపాధులను ప్రేరేపిస్తుంది. నైపుణ్య అభివృద్ధి మించి, ఈ కార్యక్రమం సామాజిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమాజంలో ఆరోగ్యం, శుభ్రత, ఆర్థిక సాక్షరత, లింగ సమానత్వం, విద్యపై అవగాహన కల్పిస్తుంది. జె ఎస్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పి ఎం జన్ మన్, అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) వంటి కీలక ఉద్యమాలతో అనుసంధానమై, సమగ్ర నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
జాతీయ ప్రణాళికలకు అనుగుణంగా, స్కిల్ ఇండియా కార్యక్రమం కింద ఉన్న అన్ని సర్టిఫికేషన్ లను నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ (ఎన్ ఎస్ క్యూఎఫ్)కు అనుసంధానం చేశారు. డిజిలాకర్, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ సీఆర్ ఎఫ్)లతో అనుసంధానం చేయడం ద్వారా నైపుణ్యాలకు అధికారిక గుర్తింపు లభించి, ఉద్యోగం,ఉన్నత విద్యలో సజావుగా మార్పిడి సాధ్యమవుతుంది.
స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కొనసాగింపుతో, ప్రభుత్వం వేగంగా మారుతున్న ఉపాధి రంగంలో నిరంతర నైపుణ్యాల అభివృద్ధి, పునర్నైపుణ్యాలను పొందడం ప్రాముఖ్యతను గుర్తిస్తూ, జీవితకాల అభ్యాసానికి తన నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది.పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్) డేటాకు ఈ చొరవ నేరుగా దోహదం చేస్తుంది, శ్రామిక అభివృద్ధి విధానాలు ఆర్థిక, పారిశ్రామిక ధోరణులకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో భారత శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడంలో స్కిల్ ఇండియా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమ–సంబంధిత శిక్షణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అంతర్జాతీయ మొబిలిటీ చొరవలను ఏకీకృతం చేయడం ద్వారా, ఈ కార్యక్రమం అధిక నైపుణ్యంతో పోటీకి దీటైన శ్రామిక శక్తిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సాధికారతకు కీలక చోదకశక్తిగా స్కిల్ ఇండియా అన్ని రంగాల్లో ఉపాధి కల్పన, వ్యవస్థాపకత, ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుంది. వృత్తి విద్యను బలోపేతం చేయడానికి, అప్రెంటిషిప్ అవకాశాలను విస్తరించడానికి, జీవితకాల విద్యను ప్రోత్సహించడానికి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ (ఎం ఎస్ డి ఇ) కట్టుబడి ఉంది. భారతదేశ కార్మిక శక్తి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండి, నైపుణ్య ఆధారిత ఉద్యోగాల్లో అంతర్జాతీయ నాయకత్వ స్థానంలో నిలబడుతుంది.
(For more details, visit: https://www.skillindiadigital.gov.in/home)
***