ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఏప్రిల్ 6న తమిళనాడులో పర్యటిస్తారు. రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారత్లో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ రైలు వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రైలు, నౌక ప్రయాణిస్తున్న విధానాన్నీ, వంతెన పని చేస్తున్న విధానాన్నీ గమనిస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. తమిళనాడులో రోడ్డు, రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేస్తారు. వీటి విలువ సుమారుగా రూ.8,300 కోట్లు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
నూతనంగా నిర్మించిన పంబన్ రైలు వంతెనను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రామేశ్వరం–తాంబరం (చెన్నై) రైలు సర్వీసును కూడా ప్రారంభిస్తారు. ఈ రైలు వంతెనకు సాంస్కృతిక ప్రాధాన్యముంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరానికి సమీపంలోని ధనుష్కోడి వద్దే మొదలుపెట్టారు.
రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ఈ వంతెన భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతుంది. రూ. 550 కోట్ల పైగా వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ వంతెన సుమారుగా 99 స్పాన్లు, 72.5 మీటర్ల పొడవున్న వర్టికల్ లిఫ్టుతో 2.08 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ లిఫ్టు 17 మీటర్ల ఎత్తు వరకు పెంచవచ్చు. తద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా రైలు, నౌకా కార్యకలాపాలు సజావుగా జరుగుతాయి. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీలు, హై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, వెల్డింగ్ చేసిన జాయింట్లతో ఈ వంతెన నిర్మించారు. ఇది తక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ కాలం మన్నుతుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డబుల్ రైలు ట్రాకులు ఏర్పాటు చేసేలా దీన్ని నిర్మించారు. కఠినమైన సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైలు వంతెన తుప్పు పట్టకుండా పాలీసిలోక్సేన్ పూత వేశారు.
తమిళనాడులో నిర్మిస్తున్న రైలు, రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితమిస్తారు. వీటి విలువ రూ.8,300 కోట్లకు పైగా ఉంటుంది. ఎన్హెచ్-40లో వలజాపేట–రాణీపేట సెక్షన్లో 28 కి.మీ మేర నాలుగు వరుసల్లో విస్తరించనున్న రహదారికి శంకుస్థాపన చేస్తారు. ఎన్హెచ్-332లో విలుప్పురం–పుదుచ్చేరి సెక్షన్లో 29 కి.మీ.ల నాలుగు లేన్ల రహదారిని, ఎన్హెచ్ -32లో 57 కి.మీ.ల పూండియన్ కుప్పం–సత్తనాతపురం విభాగాన్ని, ఎన్హెచ్ – 36లో 48 కి.మీ చోళపురం–తంజావూర్ రహదారుల్ని జాతికి అంకితం చేస్తారు. ఈ జాతీయ రహదారులు ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతాయి. నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి. వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, పోర్టులకు వేగంగా చేరుకునేలా చేస్తాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులను దగ్గరలోని మార్కెట్లకు సులభంగా రవాణా చేయడంలో రైతులకు దోహదపడతాయి. స్థానికంగా నిర్వహించే తోళ్లు, చిన్న స్థాయి పరిశ్రమల ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి.
***