ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 7, 8 లలో కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ తోపాటు గుజరాత్లో పర్యటించనున్నారు. ఆయన మార్చి 7వ తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల వేళ సిల్వాసాకు చేరుకొని నమో ఆసుపత్రి ఒకటో దశ (NAMO Hospital)ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల 45 నిమిషాలకు, సిల్వాసాలో కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ. 2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. దీని తరువాత ఆయన సూరత్కు వెళ్తారు. ఆయన సాయంత్రం సుమారు 5 గంటలకు సూరత్ ఆహార భద్రత విస్తృత ప్రచార ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. మార్చి 8న ప్రధాని నవ్సారీకి వెళ్తారు. ఉదయం దాదాపు 11 గంటల 30 నిమిషాలకు లఖ్పతి దీదీలతో (లక్షాధికారి సోదరీమణులు) భేటీ అయ్యి వారితో మాట్లాడతారు. తరువాత ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పథకాలను ప్రారంభించనున్నారు.
దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రధాని పర్యటన
దేశంలో నలు మూలలా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రోత్సహించాలన్న అంశానికి ప్రధాని అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. దీనికి అనుగుణంగా, ఆయన సిల్వాసాలో నమో ఆసుపత్రి (ఒకటో దశ)ను ప్రారంభించనున్నారు. మొత్తం రూ.460 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 450 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సేవలను చాలా వరకు బలోపేతం చేయనుంది. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేకించి గిరిజన సముదాయాల వారికి ఈ ఆసుపత్రి అత్యాధునిక చికిత్స సేవలను అందించనుంది.
కేంద్రపాలిత ప్రాంతానికి ఉద్దేశించిన రూ.2580 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ అభివృద్ధి పథకాలను ప్రధానమంత్రి ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపనలు చేస్తారు. ఈ పథకాల్లో వివిధ గ్రామీణ రహదారులు, ఇతరత్రా రహదారి సంబంధిత మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆరోగ్యం, వెల్నెస్ కేంద్రాలు, పంచాయతీ, పరిపాలన భవనాలు, ఆంగన్వాడీ కేంద్రాలు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన తదితర పథకాలున్నాయి. ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడం, పారిశ్రామిక ప్రగతి, పర్యటన రంగాల్ని ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతోపాటు ప్రజాసంక్షేమంతో ముడిపడ్డ కార్యక్రమాలకు ఊతాన్ని ఇవ్వడం.. ఇదీ ఈ పథకాల లక్ష్యం.
ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో భాగంగా నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే ఆయన పీఎం ఆవాస్ యోజన – పట్టణ, గిర్ ఆదర్శ్ ఆజీవిక యోజన, సిల్వన్ దీదీ పథకం.. వీటి లబ్ధిదారులకు ప్రయోజనాలను ప్రదానం చేస్తారు.
గిర్ ఆదర్శ్ ఆజీవిక యోజన ఉద్దేశం ఈ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డు తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకవడిన వర్గాలు (ఓబీసీలు), అల్పసంఖ్యాక వర్గాలతోపాటు దివ్యాంగజనులు.. ఈ వర్గాల మహిళల కోసం చిన్న డెయిరీ ఫారాలను ఏర్పాటు చేసి, వారి జీవనంలో సామాజికంగా, ఆర్థికంగా మార్పును తీసుకువచ్చి వారు ఆర్థిక సాధికారితను సంపాదించుకొనేటట్లు చూడడం. సిల్వన్ దీదీ పథకం మహిళా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటానికి ఉద్దేశించింది. ఈ బళ్లకు పీఎం స్వనిధి (PM SVANIDHI) పథకం నుంచి ఆర్థిక సహాయాన్ని సమకూరుస్తారు.
గుజరాత్లో ప్రధాని
ప్రధానమంత్రి మార్చి 7న, సూరత్ లోని లింబాయత్లో సూరత్ ఆహార భద్రతపై విస్తృత ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా 2.3 లక్షల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రయోజనాలను కూడా ఆయన ప్రదానం చేస్తారు.
ప్రభుత్వ వివిధ కార్యకలాపాలకు మహిళా సాధికారత ముఖ్య ఆధారంగా ఉంటోంది. ప్రధాని దార్శనికత నుంచి ప్రేరణను పొంది, మహిళల సర్వతోముఖ అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి అనుగుణంగా, మార్చి నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, నవ్సారి జిల్లాలో వాంసీ బోర్సీ గ్రామంలో ఏర్పాటైన లఖ్పతీ దీదీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. లఖ్పతి దీదీలతో ఆయన మాట్లాడతారు. లఖ్పతి దీదీలుగా ఎదిగిన అయిదుగురికి ఆయన లఖ్పతి దీదీ ధ్రువపత్రాలను అందజేసి, వారిని సన్మానిస్తారు.
ప్రధాని గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘జి–సఫల్’ (గుజరాత్ స్కీమ్ ఫర్ అంత్యోదయ ఫేమిలీస్ ఫర్ ఆగ్మెంటింగ్ లైవ్లీహుడ్స్– జిసఫల్)తోపాటు ‘జి–మైత్రి’ (గుజరాత్ మెంటర్షిప్ అండ్ యాక్సెలరేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇన్కమ్..జీమైత్రి) కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
గ్రామీణ ప్రాంతాల వారికి బతుకుతెరువుకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచే దిశగా కృషి చేస్తున్న అంకుర సంస్థలకు ‘జి–మైత్రి’ పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు ఆ సంస్థలకు కావలసిన సహకారాన్ని కూడా అందజేయనున్నారు.
గుజరాత్లోని రెండు ఆకాంక్షాత్మక జిల్లాల్లోని 13 ఆకాంక్షాత్మక బ్లాకులలో అంత్యోదయ కుటుంబాలకు చెందిన స్వయంసహాయ బృందాల (ఎస్హెచ్జీ)తో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, వారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వృద్ధిలోకి వచ్చేందుకు కావలసిన శిక్షణను కూడా ‘జి–సఫల్’ అందిస్తుంది.
***