ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెల్జియమ్ యువరాణి ఆస్ట్రిడ్తో ఈ రోజు సమావేశమయ్యారు. ఆమె ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్లో పర్యటిస్తున్న ఒక ఉన్నత స్థాయి బెల్జియమ్ ఎకనామిక్ మిషన్కు సారథ్యం వహిస్తున్నారు.
భారతదేశం తరఫున యువరాణి ఆస్ట్రిడ్ను ప్రధాని సాదరంగా ఆహ్వానించారు. వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, వ్యాపార ప్రముఖులు సహా 300 మందితో కూడిన ప్రతినిధి వర్గంతో భారత్ ను సందర్శిస్తున్నందుకు ఆయన ప్రశంసించారు.
ఆర్థిక సంబంధాల విషయమై… యువరాణి ఆస్ట్రిడ్ భారత్కు రావడం ఇది రెండోసారి. ప్రగతిపథంలో దూసుకుపోతున్న ఈ రెండు దేశాల మధ్య దృఢతర ఆర్థిక సంబంధాలు నెలకొనడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఈ పర్యటన సూచిస్తోంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, యువరాణి ఆస్ట్రిడ్ అనేక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ, నవకల్పనలు, కాలుష్యానికి తావు ఉండని తరహా ఇంధనం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగాలతోపాటు, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం, ఇరు దేశాలూ తమ తమ విద్యారంగ ప్రముఖుల పర్యటనలకు ఏర్పాట్లు చేయాలనే అంశం, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర స్నేహ సంబంధాలు వర్ధిల్లేటట్లు చూసుకోవడం వంటి అనేక విషయాలు ఈ చర్చలలో చోటు చేసుకొన్నాయి.
కొత్తగా తెరమీదకు వస్తున్న, ముఖ్యమైన రంగాలలో సహకారాన్ని అందించుకోవడానికి ఉన్న అవకాశాలను గుర్తించడానికి కలిసి పనిచేయాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి. ఇది ఆర్థిక దృఢత్వానికీ, నవకల్పనలకూ అండగా నిలిచే వృద్ధికి ఊతాన్నివ్వడంతోపాటు రెండు దేశాల ప్రజలకూ ప్రయోజనకరంగా ఉండే ద్వైపాక్షిక సహకారాన్ని కూడా విస్తృతం చేస్తుందన్న అంచనా ఉంది.