ఫిబ్రవరి 21, ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సోల్ నాయకత్వ సదస్సు’ తొలి సంచికను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన వేదికనుద్దేశించి ప్రసంగిస్తారు. గౌరవ అతిథి హోదాలో పాల్గొనే భూటాన్ రాజు దాషో షెరింగ్ టోబ్గే కీలకోపన్యాసం చేస్తారు.
ఫిబ్రవరి 21, 22 తేదీల్లో నిర్వహించే సోల్ నాయకత్వ సదస్సులో రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, ప్రజాపాలన, వాణిజ్యం, సాంఘిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని, నాయకత్వానికి సంబంధించి తమ దృక్కోణాలు, తమ జీవితాల్లోని స్ఫూర్తిదాయక అంశాలను పంచుకుంటారు. సదస్సు సహకారానికి, నాయకత్వ ఆలోచనలకు పెద్దపీట వేస్తుంది. విజయాల నుంచే కాక, పరాజయాల నుంచీ పాఠాలు నేర్చుకోగలమన్న స్ఫూర్తిని యువతకు కల్పిస్తుంది.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నిబద్ధత గల నాయకులను తయారుచేయాలన్న ఆశయంతో గుజరాత్ లోని స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) ప్రారంభమవుతోంది. సక్రమమైన శిక్షణ ద్వారా దేశ రాజకీయ నాయకత్వాన్ని తయారుచేయాలని, ఈ క్రమంలో కేవలం రాజకీయ వారసత్వం ఆధారంగా వచ్చే అభ్యర్థులకే కాక, ప్రతిభ, అంకితభావం, ప్రజా సేవపట్ల ఆసక్తి ఆధారంగా పైకొచ్చిన వారికి చేయూతనందించాలని సంస్థ ఆశిస్తోంది. నేటి సమాజంలోని సంక్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొనే నాయకత్వానికి అవసరమైన దృక్పథం, నైపుణ్యాలను సోల్ సంస్థ శిక్షితులకు అందిస్తుంది.
****