Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నావికాదళ ప్రధాన యుద్ధ నౌకలు- ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

నావికాదళ ప్రధాన యుద్ధ నౌకలు- ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ప్రధాన నావికాదళ యుద్ధ నౌకల ప్రారంభం… రక్షణ రంగం బలోపేతం, స్వావలంబన పట్ల భారతదేశ అచంచలమైన నిబద్ధతను చాటుతుంది: ప్రధానమంత్రి

21వ శతాబ్దపు భారత నావికాదళ సాధికారత దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు: ప్రధానమంత్రి

నేటి భారతదేశం ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోంది: ప్రధానమంత్రి

నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందింది: ప్రధానమంత్రి

హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా భారతదేశం మొదటి ప్రతిస్పందన దేశంగా అవతరించింది: ప్రధానమంత్రి

భూమి, నీరు, గాలి, లోతైన సముద్రం లేదా అనంత అంతరిక్షం ఏదైనా సరే, భారతదేశం ప్రతిచోటా తన ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తోంది: ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో మూడు ప్రధాన నావికాదళ యుద్ధ వాహనాలు- పఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… జనవరి 15వ తేదీని ఆర్మీడేగా జరుపుకుంటున్నామని, దేశ భద్రత కోసం జీవితాలను త్యాగం చేసిన ప్రతి వీర యోధుడికి అభివాదం చేస్తున్నానని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా సైనిక వీరులకు ఆయన అభినందనలు తెలిపారు.

భారతదేశ సముద్ర వారసత్వానికి, నావికాదళం అద్భుతమైన చరిత్రకు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కు నేడు ఒక గొప్ప రోజు అని ప్రధాన మంత్రి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో నావికాదళానికి కొత్త బలాన్నీ, దార్శనికతను ఇచ్చారని అన్నారు. శివాజీ మహారాజ్ నడయాడిన నేలలో 21వ శతాబ్దపు భారత నౌకాదళాన్ని బలోపేతం చేసే దిశగా నేడు ప్రభుత్వం కీలకమైన అడుగు వేసిందన్నారు. “ఒక డిస్ట్రాయర్, ఫ్రిగేట్,  జలాంతర్గామిని త్రివిధీకరణ చేయడం ఇదే మొదటిసారి” అని ప్రధాన మంత్రి అన్నారు. మొత్తం మూడు యుద్ధ వాహనాలు భారత్ లోనే తయారు కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత నావికాదళాన్నీ, నిర్మాణ పనుల్లో భాగస్వాములైన వారందరినీ, భారత పౌరులను ఆయన అభినందించారు.

“నేటి కార్యక్రమం మన అద్భుతమైన వారసత్వాన్ని మన భవిష్యత్తు ఆకాంక్షలతో ముడిపెడుతుంది” అని శ్రీ మోదీ ఉద్వేగంతో అన్నారు. సుదూర సముద్ర ప్రయాణాలు, వాణిజ్యం, నౌకాదళ రక్షణ, నౌకా పరిశ్రమకు సంబంధించి భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఈ ఘనమైన చరిత్రను అవకాశంగా తీసుకుని నేటి భారతదేశం ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోందని ఆయన అన్నారు. ఈ రోజు ప్రారంభించిన వేదికలు దీనికి అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. ఐఎన్ఎస్ నీలగిరితో సహా కొత్త వేదికల ప్రారంభం చోళ రాజవంశం సముద్ర పరాక్రమానికి అంకితమని,  సూరత్ యుద్ధనౌక గుజరాత్ ఓడరేవులు భారతదేశాన్ని పశ్చిమాసియాతో అనుసంధానించిన యుగాన్ని గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం తొలి జలాంతర్గామి కల్వరిని ప్రారంభించిన తర్వాత పీ75 తరగతిలో ఆరోదైన వాగ్షీర్ జలాంతర్గామిని ప్రారంభించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కొత్త సరిహద్దు వేదికలు భారతదేశ భద్రత, పురోగతి రెండింటికీ దోహదం చేస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“భారతదేశం నేడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందింది” అని ప్రధాన మంత్రి అన్నారు. భారత్ విస్తరణవాదంతో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. స్వేచ్చాయుత, సురక్షితమైన, సమ్మిళిత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

తీరప్రాంత దేశాల అభివృద్ధి విషయానికి వస్తే ఈ ప్రాంతంలో అందరికీ భద్రత, వృద్ధి (సాగర్) మంత్రాన్ని భారత్ ప్రవేశపెట్టిందని, ఈ దార్శనికతతో పురోగమించిందని ఆయన పేర్కొన్నారు. జి 20 అధ్యక్ష పదవీకాలంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ, “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లామని, కోవిడ్ -19 మహమ్మారికి  వ్యతిరేకంగా చేసిన ప్రపంచవ్యాప్త పోరాటంలో “ఒకే భూమి, ఒకే ఆరోగ్యం” అనే దృష్టి కోణాన్ని అందించామని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఈ ప్రాంతం మొత్తం రక్షణ, భద్రతను భారత్ తన బాధ్యతగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవహారాలు, భౌగోళిక రాజకీయాలు రూపొందించడంలో భారతదేశం వంటి సముద్ర దేశాల ముఖ్య పాత్ర అవసరాన్ని ప్రస్తావిస్తూ, ప్రాదేశిక జలాలను రక్షించడం, నౌకాయాన స్వేచ్ఛను కల్పించడం, ఆర్థిక పురోగతి, ఇంధన భద్రత కోసం వాణిజ్య రవాణా మార్గాలను, సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచడం ప్రముఖంగా ప్రధానమంత్రి వివరించారు. ఉగ్రవాదం, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సముద్రాలను సురక్షితంగా, సుసంపన్నంగా మార్చడంలో, రవాణా సామర్థ్యాన్ని పెంచడంలో , నౌకారంగ పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ భాగస్వాములుగా మారవలసిన ప్రాముఖ్యతను శ్రీ మోదీ వివరించారు. అరుదైన ఖనిజాలు, చేపల నిల్వలు వంటి సముద్ర వనరుల దుర్వినియోగాన్ని నివారించాలని, వాటిని నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు. కొత్త షిప్పింగ్ మార్గాలు , సముద్ర కమ్యూనికేషన్ మార్గాలలో పెట్టుబడుల ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి… భారతదేశం ఈ దిశలో నిరంతరం సంతృప్తికరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. “హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమస్యలకు, సవాళ్లకు భారతదేశం మొదటి ప్రతిస్పందన దేశంగా ఆవిర్భవించింది” అని అన్నారు. ఇటీవలి నెలల్లో, భారత నావికాదళం వందలాది మంది ప్రాణాలను కాపాడిందని, వేల కోట్ల విలువైన జాతీయ, అంతర్జాతీయ సరుకును రక్షించిందని, భారతదేశం, భారత నావికాదళం, కోస్టు గార్డుపై ప్రపంచ నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఆసియాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా దేశాలతో భారతదేశం ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ ఉనికి, సామర్థ్యాలు దీనికి కారణమని పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమం సైనిక పరంగా, ఆర్థిక పరంగా రెండు విధాలా ప్రాధాన్యత కలిగినదని ఆయన అన్నారు.

21వ శతాబ్దంలో భారతదేశ సైనిక సామర్థ్యాలను పెంచవలసిన, ఆధునీకరించవలసిన, ప్రాముఖ్యతను స్పష్టం చేసిన ప్రధాని… “భూమి, నీరు, గాలి, లోతైన సముద్రం లేదా అనంత అంతరిక్షం ఏదైనా సరే, భారతదేశం ప్రతిచోటా తన ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తోంది” అని చెప్పారు. సాయుధ దళాల ప్రధానాధికారి పదవి ఏర్పాటు సహా నిరంతరం చేపడుతున్న సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారు. సాయుధ దళాల సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు థియేటర్ కమాండ్ల అమలు దిశగా భారత్ పురోగమిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

గత దశాబ్ద కాలంగా భారతదేశ సాయుధ బలగాలు ఆత్మనిర్భరత (స్వయం-విశ్వాసం)ను స్వీకరించడాన్ని ప్రధానమంత్రి అభినందిస్తూ, సంక్షోభాల సమయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇకమీదట దిగుమతి చేసుకోనవసరం లేని 5,000ల కంటే ఎక్కువ వస్తువులు, పరికరాలను సాయుధ దళాలు గుర్తించాయని ఆయన వెల్లడించారు. దేశీయంగా తయారైన పరికరాలను ఉపయోగించడంలో పెరిగిన భారత సైనికుల విశ్వాసాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కర్మాగారాన్ని, సాయుధ బలగాల కోసం రవాణా విమానాల కర్మాగారాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేయడాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. తేజస్ యుద్ధ విమానం సాధించిన విజయాలను, రక్షణ రంగ ఉత్పత్తిని వేగవంతం చేస్తున్న ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని రక్షణ కారిడార్ల అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. మజాగావ్ డాక్‌యార్డ్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రస్తావిస్తూ, మేక్ ఇన్ ఇండియా విస్తరణలో నౌకాదళం చేస్తున్న కృషి పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గత దశాబ్దంలో నేవీలో 33 నౌకలు, ఏడు జలాంతర్గాములు చేరాయని, 40 నౌకాదళ నౌకల్లో 39 భారత షిప్‌యార్డుల్లోనే నిర్మించినట్లు చెప్పారు. అత్యద్భుతమైన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక,  ఐఎన్ఎస్ అరిహంత్, అలాగే ఐఎన్ఎస్ అరిఘాట్ వంటి అణు జలాంతర్గాములు వీటిలో భాగంగా ఉన్నాయన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిన సాయుధ బలగాలను ప్రధాని అభినందించారు. భారతదేశ రక్షణ ఉత్పత్తి రూ. 1.25 లక్షల కోట్లను అధిగమించిందని, మన దేశం ప్రస్తుతం 100 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని ఆయన తెలిపారు. నిరంతర మద్దతుతో భారత రక్షణ రంగం వేగంగా మార్పు చెందుతోందని ఆయన చెప్పారు.

“మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత సాయుధ బలగాల సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా ఆర్థిక ప్రగతికి కొత్త మార్గాలను అందిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. నౌకానిర్మాణ రంగాన్ని ఉదాహరణగా చూపుతూ, నౌకానిర్మాణంలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి ఆర్థిక వ్యవస్థపై దాదాపు రెట్టింపు సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన 60 భారీ నౌకలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ పెట్టుబడి నుండి దాదాపు రూ. 3 లక్షల కోట్ల ఆర్థిక రాబడి రానుందని అలాగే ఉపాధి పరంగా ఇది ఆరు రెట్లు అధిక ప్రభావాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓడ విడిభాగాల్లో చాలా వరకు దేశీయ ఎమ్ఎస్ఎమ్ఇలు తయారు చేస్తున్నాయన్న శ్రీ మోదీ… 2,000ల మంది కార్మికులు ఓడ నిర్మాణంలో పాల్గొంటే, ఇతర పరిశ్రమల్లో, ముఖ్యంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలో దాదాపు 12,000ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దేశం వేగవంతమైన పురోగతిని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి… భవిష్యత్తులో వందలాది కొత్త నౌకలు, కంటైనర్ల ఆవశ్యకతను పేర్కొంటూ, తయారీ, ఎగుమతి సామర్థ్యంలో నిరంతర వృద్ధి కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. పోర్ట్ నేతృత్వంలోని అభివృద్ధి నమూనా మొత్తం ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేస్తూ, వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. సముద్రయాన రంగంలో పెరుగుతున్న ఉపాధికి ఒక ఉదాహరణను ఉటంకిస్తూ… దేశంలో నావికుల సంఖ్య 2014లో 1,25,000 కంటే తక్కువగా ఉండగా, నేడు దాదాపు 3,00,000లకి పైగా అంటే రెండింతలు పెరిగిందని తెలిపారు. నావికుల సంఖ్య పరంగా మన దేశం ఇప్పుడు ప్రపంచంలోని మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలను వేగంగా రూపొందించడం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వంటి అనేక ప్రధాన నిర్ణయాలతో తమ ప్రభుత్వ మూడో హాయాం ప్రారంభమైందని ప్రధానమంత్రి తెలిపారు. ఓడరేవు రంగం విస్తరణ సహా దేశంలోని ప్రతి మూలలో, రంగంలో అభివృద్ధి జరిగేలా చేయు లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మూడో హాయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో మహారాష్ట్రలో వధావన్ పోర్ట్‌ ఏర్పాటు ముఖ్యమైనదని శ్రీ మోదీ పేర్కొన్నారు. రూ. 75,000ల కోట్ల పెట్టుబడితో ఈ ఆధునిక నౌకాశ్రయం నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, దీని ద్వారా మహారాష్ట్రలో వేలాది కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులో రానున్నాయని తెలిపారు.

సరిహద్దులు, తీరప్రాంతాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అనుసంధానం విషయంగా గత దశాబ్దంలో జరిగిన కృషిని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్ సొరంగమార్గం ఇటీవల ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ఇది కార్గిల్, లదాఖ్ వంటి సరిహద్దు ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు. గత ఏడాది అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన సెలా టన్నెల్ సైన్యం ఎల్ఎసికి చేరుకోవడాన్ని సులభతరం చేసిందన్న ప్రధానమంత్రి, షింకున్ లా టన్నెల్, జోజిలా టన్నెల్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో భారతమాల ప్రాజెక్ట్ అద్భుతమైన జాతీయ రహదారుల నెట్‌వర్కును రూపొందిస్తోందన్న ఆయన, సరిహద్దు గ్రామాల అభివృద్ధిలో వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. గత దశాబ్ద కాలంలో మారుమూల ద్వీపాలపై ప్రభుత్వం దృష్టి సారించిందనీ, దానిలో భాగంగా సాధారణ పర్యవేక్షణ, జనావాసాలు లేని ద్వీపాలకు పేరు పెట్టడం వంటి కార్యక్రమాలను గురించి ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. హిందూ మహాసముద్రంలోని నీటి అడుగున సీమౌంట్‌లకు పేరు పెట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు, భారతదేశ చొరవతో ఒక అంతర్జాతీయ సంస్థ గత సంవత్సరం అలాంటి ఐదు ప్రదేశాలకు పేరు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

భవిష్యత్తులో బాహ్య అంతరిక్షం, లోతైన సముద్రం రెండు రంగాలకు గల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ రంగాల్లో తన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మన దేశం చేస్తున్న కృషిని వివరించారు. సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు శాస్త్రవేత్తలను తీసుకెళ్లే లక్ష్యంతో మొదలైన సముద్రయాన్ ప్రాజెక్ట్, కొన్ని దేశాలు మాత్రమే సాధించిన ఘనతగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తు అవకాశాలను అన్వేషించే ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.

వలసవాద భావజాలం నుంచి దేశాన్ని విముక్తి చేయడం ద్వారా 21వ శతాబ్దంలో మరింత విశ్వాసంతో ముందుకు సాగుతున్న ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ విషయంలో భారత నౌకాదళం చూపిన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, నేవీ తన పతాకాన్ని అద్భుతమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ సంప్రదాయంతో అనుసంధానం చేసిందనీ అలాగే దానికి అనుగుణంగా అడ్మిరల్ ర్యాంక్ భుజకీర్తులను పునఃరూపకల్పన చేసిందని వివరించారు. మేక్ ఇన్ ఇండియా, స్వావలంబనను ప్రోత్సహించే ప్రచారం వలసవాద మనస్తత్వం నుంచి విముక్తిని కలిగిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. దేశం గర్వించదగ్గ క్షణాలను కొనసాగిస్తుందన్న ఆయన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఇది దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బాధ్యతలు వేరైనా, లక్ష్యం ఒక్కటేనని అదే వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) అని ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్ సహా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

రక్షణ రంగ తయారీ, సముద్ర భద్రతలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలనే భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో రెండు ప్రధాన నౌకాదళ రక్షణ నౌకల, జలాంతర్గామి తయారీ గణనీయమైన ముందడుగును సూచిస్తుంది. ఐఎన్ఎస్ సూరత్, పీ15బి గైడెడ్ క్షిపణి విధ్వంసక ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించిన నాల్గవ, చివరి నౌక. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అధునాతన విధ్వంసక నౌకల్లో ఒకటిగా ఉంది. ఇది 75% స్వదేశీ పరికరాలను కలిగి ఉంది. అలాగే అత్యాధునిక ఆయుధ-సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-ఆధారిత సామర్థ్యాలను కలిగి ఉంది. ఐఎన్ఎస్ నీలగిరి, పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్‌లోని మొదటి నౌకను, భారత నావికాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. అలాగే తదుపరి తరం స్వదేశీ యుద్ధనౌకలను ప్రతిబింబిస్తూ మెరుగైన మనుగడ, సీకీపింగ్, స్టెల్త్ కోసం అధునాతన లక్షణాలను ఇది కలిగి ఉంది. పీ75 స్కార్పెన్ ప్రాజెక్ట్ ఆరవ, చివరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామి నిర్మాణంలో పెరుగుతున్న భారతదేశ నైపుణ్యాన్ని సూచిస్తుంది. అలాగే దీనిని ఫ్రాన్స్ నావల్ గ్రూప్ సహకారంతో నిర్మించారు.