పేరెన్నికగన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయి పటేల్ గారు, కేంద్ర క్యాబినెట్ లో నా సహచరుడు శ్రీ సి.ఆర్. పాటిల్ గారూ, గుజరాత్ రాష్ట్ర మంత్రులు, ఇక్కడ హాజరైన ప్రజలు, సూరత్ లోని నా సోదరసోదరీమణులారా!
మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉన్నారా? దేశ ప్రజలు, గుజరాత్ ప్రజలు నాకు మూడోసారి ప్రధానిగా పనిచేసే అవకాశం కల్పించడం నా అదృష్టం. ఆ తర్వాత సూరత్ కు రావడం ఇదే తొలిసారి. గుజరాత్ పెంచి పోషించిన వ్యక్తిని దేశం ప్రేమతో ఆలింగనం చేసుకుంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితాన్ని తీర్చిదిద్దడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషించారు. నేడు నేను సూరత్కు వచ్చినప్పుడు, సూరత్ ప్రేరణను గుర్తు తెచ్చుకోకుండా, అనుభూతి చెందకుండా ఎలా ఉండగలను? శ్రమ, దాతృత్వం – ఈ రెండు లక్షణాలే సూరత్ కు నిజంగా ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఒకరికి ఒకరు సహాయపడటం, అందరి అభివృద్ధిని వేడుక చేసుకోవడం సూరత్లో ప్రతి మూలలో కనిపించే గుణం. సూరత్ లోని ఈ స్ఫూర్తిని, భావోద్వేగాన్ని ప్రోత్సహించడంలో నేటి కార్యక్రమం ఒక ముందడుగు.
మిత్రులారా,
సూరత్ అనేక విషయాల్లో గుజరాత్లోనే కాదు. దేశంలో కూడా ప్రముఖ నగరంగా ఉంది. ఇప్పుడు, పేదలు, అట్టడుగున ఉన్నవారి కోసం ఆహార, పోషక భద్రతను కల్పించే లక్ష్యంలో కూడా సూరత్ ముందువరసలో ఉంది. నూటికి నూరు శాతం మందికి ఆహార భద్రత కల్పించే విషయంలో సూరత్లో నిర్వహిస్తున్న ఫుడ్ సెక్యూరిటీ సాచురేషన్ (సంతృప్తత) ప్రచారం దేశంలోని ఇతర జిల్లాలకు కూడా ప్రేరణగా నిలవనుంది. ఆహార భద్రతలో 100% మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చేయడం ఈ సంతృప్త ప్రచార ఉద్దేశం. ఇందులో ఎటువంటి వివక్ష ఉండదు. ఏ ఒక్కరినీ వెనుకబడనివ్వదు. అసంతృప్తికి గానీ, ఎలాంటి దోపిడీకి గానీ అవకాశం ఉండదు. ఈ కార్యక్రమం ప్రలోభాలకు, అనైతిక చర్యలకు ఎలాంటి ఆస్కారం లేకుండా అందరికీ సంపూర్ణ సంతృప్తిని అందించే పవిత్ర భావనను ముందుకు తీసుకెళ్తుంది. ప్రభుత్వమే లబ్ధిదారుల ముంగిటకు చేరుతుంటే ఎవరినైనా ఎలా వదిలేస్తారు? ఎవరినీ వదిలిపెట్టనప్పుడు, ఎవరూ నిర్లక్ష్యానికి గురికారు. అంతేకాక, ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు, వ్యవస్థను దోపిడీ చేయడానికి ప్రయత్నించే వారు సహజంగానే తప్పుకుంటారు.
మిత్రులారా,
ఈ ప్రచారం కింద ఇక్కడ కొత్తగా 2.25 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువమంది వృద్ధులైన తల్లులు, ఇంకా సోదరీమణులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఉన్నారు. ఈ స్నేహితులందరినీ ఇప్పుడు ఈ ప్రయత్నంలో చేర్చారు. ఇకపై ఈ కొత్త కుటుంబ సభ్యులకు ఉచిత రేషన్, పౌష్టికాహారం కూడా అందనుంది. లబ్దిదారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
మనందరికీ “రోటి, కపడా ఔర్ మకాన్” (ఆహారం, వస్త్రం, నివాసం) అనే మాట తెలిసే ఉంటుంది. ఆహారం అనేది వస్త్రం, నివాసం కంటే కూడా ఎంత ముఖ్యమైనదో సూచిస్తుంది. ఒక పేదవాడికి ఆహారం గురించి ఆందోళన ఉంటే, ఆ బాధ ఏమిటన్నది నేను పుస్తకాలలో చదవాల్సిన అవసరం లేదు; నేను దాన్ని అనుభూతి చెందగలను. అందుకే గత కొన్నేళ్లుగా మా ప్రభుత్వం నిరుపేదలకు ఆహార భద్రత కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒక పేద ఇంటి లో పొయ్యి వెలగకుండా, పిల్లలు కన్నీళ్లు పెట్టుకుని ఆకలితో పడుకుంటే– ఇందుకు భారత్ ఎంతమాత్రం అంగీకరించదు. అందుకే ప్రతి ఒక్కరికీ ఆహారం, గృహవసతి కల్పించడం మా ప్రథమ ప్రాధాన్యాంశం.
మిత్రులారా,
ఈ రోజు, మా ప్రభుత్వం పేదలకు నిజమైన తోడుగా నిలుస్తోందని, వారికి అంకితభావంతో సేవలందిస్తోందని నేను సంతృప్తి చెందుతున్నాను. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, మన పౌరులకు అత్యంత మద్దతు అవసరమైనప్పుడు, మేము ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రారంభించాం. ఇది మానవత్వంతో నడిచే పథకం. ప్రతి పేద ఇంటిలో నిత్యం పొయ్యి వెలిగేలా చూసుకున్నాం. ఈ చొరవ ప్రపంచంలోనే అతిపెద్దది. నిజంగా ప్రత్యేకమైనది. ఇది నేటికీ కొనసాగుతోంది. గుజరాత్ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించడం సంతోషంగా ఉంది. ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా, దీని ప్రయోజనాలను ఎక్కువ మంది లబ్ధిదారులు పొందేలా గుజరాత్ చొరవ తీసుకుంది. నేడు కేంద్ర ప్రభుత్వం ప్రతి పేద ఇంటి పొయ్యి నిత్యం వెలిగేలా ఉండేందుకు ఏటా రూ.2.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది.
మిత్రులారా,
‘వికసిత భారత్‘ దిశగా సాగే ప్రయాణంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ప్రజలలో పోషకాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు ప్రతి కుటుంబానికి సరిపడా పోషకాహారం అందించడమే మా లక్ష్యం. పీఎం పోషణ్ పథకం కింద 12 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోంది. సాక్షం అంగన్ వాడీ కార్యక్రమం చిన్న పిల్లలు, తల్లులు, గర్భిణీ స్త్రీల పోషణ పై దృష్టి పెట్టింది. పీఎం మాతృ వందన యోజన కింద గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందించేందుకు వేలాది రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది.
మిత్రులారా,
పోషకాహారం అంటే మంచి ఆహారం మాత్రమే కాదు. ఇందులో పరిశుభ్రత కూడా ఒక కీలకమైన అంశం. అందుకే మా ప్రభుత్వం పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తోంది. పరిశుభ్రత విషయానికి వస్తే, జాతీయ పోటీ జరిగినప్పుడల్లా సూరత్ ఎల్లప్పుడూ టాప్ ర్యాంకింగ్ నగరాలలో ఒకటిగా ఉంటోంది. అందుకే సూరత్ ప్రజలను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
దేశంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామం మురికిని తొలగించి పరిశుభ్రత పాటించే దిశగా కృషి కొనసాగించాలన్నదే మా లక్ష్యం. స్వచ్ఛభారత్ అభియాన్ వల్ల గ్రామాల్లో వ్యాధులు గణనీయంగా తగ్గాయని నేడు అనేక అంతర్జాతీయ సంస్థలు అంగీకరిస్తున్నాయి. అంతేకాక, మన సి.ఆర్. పాటిల్ ఇప్పుడు జల మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నారు. దీని కింద హర్ ఘర్ జల్ అభియాన్ అమలు జరుగుతోంది. ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీరు చేరడంతో నీటి ద్వారా వచ్చే అనేక వ్యాధులు గణనీయంగా తగ్గాయి.
మిత్రులారా,
నేడు, మా ఉచిత రేషన్ పథకం లక్షలాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేసింది. ఇప్పుడు అర్హులైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలు అందుతున్నాయి. కానీ పదేళ్ల క్రితం అది సాధ్యపడలేదు. మీరు ఊహించగలరా? మన దేశంలో 5 కోట్లకు పైగా నకిలీ రేషన్ కార్డుదారులు ఉన్నారు! గుజరాత్ లో వీటిని భూతియా కార్డులు (ఘోస్ట్ కార్డులు) అని పిలుస్తాం. అసలు పుట్టనే లేని ఐదు కోట్ల మంది వ్యక్తుల పేర్లు రేషన్ కార్డుల్లో ఉన్నాయి. ఈ నకిలీ గుర్తింపులను ఉపయోగించి, నిజమైన లబ్ధిదారులైన పేదలకు చెందాల్సిన ఆహారాన్ని దోచుకుంటున్నారు. ఈ విషయాన్ని మీరు నా దృష్టికి తెచ్చారు. మరి నేను ఏమి చేశాను? వారిని పూర్తిగా తొలగించాను. ఈ ఐదు కోట్ల నకిలీ పేర్లను వ్యవస్థ నుంచి తొలగించి, మొత్తం రేషన్ పంపిణీ వ్యవస్థను ఆధార్ కార్డుతో అనుసంధానం చేశాం. ఇప్పుడు మీరు ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు, మీకు న్యాయమైన వాటా లభిస్తుంది. రేషన్ కార్డులకు సంబంధించిన మరో పెద్ద సమస్యను పరిష్కరించాం.
సూరత్లో ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కూలీలు పని చేస్తున్నారు. ఒకప్పుడు, ఒక రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు మరొక రాష్ట్రంలో అమలులో ఉండేది కాదు. ఈ సమస్యను మేము పరిష్కరించాం. “వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్”ను అమలు చేశాం. ఇప్పుడు, మీ రేషన్ కార్డు ఎక్కడ జారీ చేసివున్నా, దేశంలో ఎక్కడైనా మీరు మీ హక్కు పొందగలరు.ఇప్పటికే సూరత్ లోని పలువురు వలస కార్మికులు దీని ద్వారా లబ్ది పొందుతున్నారు. సరైన ఉద్దేశ్యంతో విధానాలు రూపొందిస్తే అవి నిజంగా పేదలకు ఉపయోగపడతాయనడానికి ఇదే నిదర్శనం.
మిత్రులారా,
గత దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా పేదల సాధికారత కోసం ఒక లక్ష్యంతో పనిచేశాం. నిరుపేదలు ఎవరిపైనా ఆధారపడకుండా, భిక్షాటన చేయాల్సిన అవసరం లేకుండా రక్షణ కవచం నిర్మించాం. పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, కుళాయి నీటి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా పేదలలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాం. ఆ తర్వాత పేద కుటుంబాలకు బీమా భద్రత వలయాన్ని ఏర్పాటు చేశాం. తొలిసారిగా దాదాపు 60 కోట్ల మంది భారతీయులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స భరోసా కల్పించాం. గతంలో పేద కుటుంబాలు జీవిత బీమా, ప్రమాద బీమా గురించి ఆలోచించేవారు కాదు. కానీ మా ప్రభుత్వం పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు బీమా భద్రత కల్పించింది. ప్రస్తుతం 36 కోట్ల మంది ప్రభుత్వ బీమా పథకాల్లో చేరారు. ఇప్పటికే రూ.16,000 కోట్లకు పైగా బీమా క్లెయిమ్ లను పేద కుటుంబాలకు అందించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరో మాటలో చెప్పాలంటే, ఈ డబ్బు సంక్షోభ సమయాల్లో వారికి సహాయపడింది.
మిత్రులారా,
ఎవరూ పట్టించుకోని వారిని, మోదీ పట్టించుకున్నారు. ఆ రోజులు గుర్తున్నాయా? ఒకప్పుడు ఒక పేదవాడు వ్యాపారం మొదలెట్టాలని భావించినప్పుడు, బ్యాంకులు వారికి లోన్లు ఇవ్వకపోవడమే కాదు, అసలు లోపలికి కూడా రానిచ్చేవి కాదు! బ్యాంకులు గ్యారంటీ కోరేవి, కానీ పేదవాడు ఎక్కడి నుంచి గ్యారంటీ తీసుకొస్తాడు? ఎవరు పేదవానికి గ్యారంటీ ఇస్తారు? అందుకే, ఒక పేద తల్లి కుమారుడైన మోదీ స్వయంగా వారి గ్యారంటీదారుడిగా నిలవాలని నిర్ణయించుకున్నారు! పేదల గ్యారంటీ బాధ్యతను మోదీ తీసుకుని ముద్ర యోజనను ప్రారంభించారు. ఈరోజు, ముద్ర యోజన కింద ఎటువంటి పూచీకత్తు లేకుండానే 32 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ప్రతిరోజూ మాపై విమర్శలు చేసే వారికి, 32 లక్షల కోట్ల రూపాయలను రాసి చూడమని చెప్పండి—అందులో ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వారికి అర్థం కావడం కష్టం! జీరో సీట్లు ఉన్నవారు ఈ సంఖ్యలను ఎలా అర్థం చేసుకుంటారు? మోదీ ఈ గ్యారంటీ తీసుకుని, ఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రజలకు 32 లక్షల కోట్ల రూపాయలను అందించారు.
మిత్రులారా,
గతంలో వీధి వ్యాపారులకు, హాకర్లకు, ఫుట్ పాత్ కార్మికులకు ఎలాంటి సాయం చేసేందుకు ఎవరూ లేరు. ఒక పేద కూరగాయల వ్యాపారిని ఊహించుకోండి–అతనికి సరుకులు కొనడానికి ఉదయం 1,000 రూపాయలు అవసరం. వడ్డీ వ్యాపారి వద్దకు వెడితే రూ.1000 తన పుస్తకంలో రాసి కేవలం రూ.900 మాత్రమే ఇచ్చాడు. రోజంతా కష్టపడి, రుణం తిరిగి చెల్లించడానికి సాయంత్రం తిరిగి వెళ్ళినప్పుడు వడ్డీ వ్యాపారి మొత్తం 1,000 రూపాయలు డిమాండ్ చేశాడు! ఇప్పుడు చెప్పండి, ఆ పేదవాడు ఎలా బతుకుతాడు? తన పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు? అలాంటి వారికి నేరుగా బ్యాంకు రుణాలు అందించేందుకు మా ప్రభుత్వం స్వనిధి యోజనను ప్రారంభించింది. ఈ ఏడాది బడ్జెట్ లో మరో అడుగు ముందుకేసి వీధి వ్యాపారులు, హాకర్ల కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రకటించాం. అదేవిధంగా, మన విశ్వకర్మ సహచరుల గురించి కూడా మేము ఆలోచన చేశాం. తరతరాలుగా మన దేశానికి సేవ చేస్తున్న చేతివృత్తులు, నైపుణ్యం కలిగిన కార్మికుల గురించి కూడా మేము ఆలోచించాం. తొలిసారిగా పీఎం విశ్వకర్మ పథకం కింద వేలాది మంది స్నేహితులకు శిక్షణ ఇస్తున్నారు. వారి కళను మెరుగుపరచడానికి వారికి ఆధునిక పనిముట్లు, కొత్త డిజైన్ నైపుణ్యాలను అందిస్తున్నారు. వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. ఫలితంగా వారు తమ సాంప్రదాయ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‘ అంటే ఇదే! గరీబీ హఠావో (పేదరిక నిర్మూలన) నినాదం విని దశాబ్దాలుగా భారతీయులు విసిగిపోయారు. ప్రతి ఎన్నికల సమయంలో ‘గరీబీ హఠావో‘ నినాదాలు పునరావృతమవుతున్నా పేదరికం మాత్రం తగ్గలేదు. కానీ భారతదేశంలోని 25 కోట్లకు పైగా పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేలా చేసిన వ్యక్తిగా మీరు నన్ను తీర్చిదిద్దారు.
మిత్రులారా,
ఇక్కడ సూరత్ లో మధ్యతరగతి కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయి. దేశాభివృద్ధిలో మధ్యతరగతి కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే గత దశాబ్దకాలంగా మధ్యతరగతి సాధికారత కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది బడ్జెట్ కూడా ఆ నిబద్ధతను కొనసాగిస్తోంది. తాజాగా ప్రకటించిన ఆదాయపు పన్ను ఉపశమనం దుకాణదారులు, వ్యాపార యజమానులు, వేతన ఉద్యోగులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పుడు, 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పూర్తిగా పన్ను రహితం– ఇదిఇంతకు ముందు ఎవరూ ఊహించనిది, కానీ మేము దానిని చేసాము. వేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితం. పన్ను శ్లాబులను కూడా పునర్వ్యవస్థీకరించి, ప్రతి పన్ను చెల్లింపుదారుడికి ప్రయోజనం కలిగేలా చూశాం. ఇప్పుడు దేశంలో, గుజరాత్, సూరత్ లలో మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ ఖర్చుపెట్టే ఆదాయం ఉంటుంది. వారు తమ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు. వారి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టవచ్చు.
మిత్రులారా,
సూరత్ పారిశ్రామికవేత్తల నగరం, అనేక చిన్న పరిశ్రమలకు, ఎంఎస్ఎంఇలకు నిలయం. సూరత్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. స్థానిక సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది, అందుకే ఎంఎస్ఎంఇలకు గణనీయమైన మద్దతు లభిస్తోంది. మొదట, మేము ఎంఎస్ఎంఇ ల నిర్వచనాన్ని మార్చాం. వాటి విస్తరణకు కొత్త మార్గాలను తెరిచాం. ఈ ఏడాది బడ్జెట్ ఈ నిర్వచనాన్ని మరింత మెరుగుపరిచింది. గత కొన్నేళ్లుగా ఎంఎస్ఎంఇ లకు రుణాలు పొందడం సులభతరం చేశాం. ఎంఎస్ఎంఇలను ఆదుకునేందుకు ఈ బడ్జెట్లో రూ.5 లక్షల పరిమితితో ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టాం. ఇది వారికి గణనీయమైన ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మరింత మంది యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది ఎంఎస్ఎంఇ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించడమే మా ప్రయత్నం. ఇందులో ముద్ర పథకం ప్రధాన పాత్ర పోషించింది. దళితులు, ఆదివాసీలు, మహిళలకు తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్ లో రూ.2 కోట్ల వరకు రుణాలు ప్రకటించారు. ఇది సూరత్, గుజరాత్ యువతకు ఎంతో మేలు చేస్తుంది. మీరందరూ ముందుకు వచ్చి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను–నేను మీతో ఉన్నాను.
మిత్రులారా,
భారత్ అభివృద్ధికి దోహదపడే వివిధ రంగాల్లో సూరత్ గణనీయమైన పాత్ర పోషిస్తోంది. నగరంలో టెక్స్ టైల్స్, కెమికల్స్, ఇంజినీరింగ్ కు సంబంధించిన పరిశ్రమల విస్తరణకు కృషి చేస్తున్నాం. సూరత్ ను ప్రపంచ స్థాయి కనెక్టివిటీతో గ్లోబల్ బిజినెస్ హబ్ గా మార్చాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశాం. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఢిల్లీ–ముంబయి ఎక్స్ప్రెస్ వే, రాబోయే బుల్లెట్ ట్రైన్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సూరత్ వృద్ధికి కీలకం కానున్నాయి. ఇంకా, సూరత్ మెట్రో కూడా నగరం కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది, ఇది భారతదేశంలో ఉత్తమంగా అనుసందానమైన నగరాలలో ఒకటిగా మారుస్తుంది. ఈ ప్రయత్నాలు సూరత్ ప్రజల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.
మిత్రులారా,
మీకు గుర్తున్నట్లుగా, కొన్ని రోజుల క్రితం, నేను మన దేశంలోని మహిళలను వారి విజయ గాథలు, విజయాలు, స్ఫూర్తిదాయక జీవిత ప్రయాణాలను నమో యాప్ లో పంచుకోవాలని కోరాను. నమో యాప్ లో ఎంతో మంది అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు తమ కథలను పంచుకున్నారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. రేపు మహిళా దినోత్సవం, ఈ ప్రత్యేక సందర్భంలో, ఈ స్ఫూర్తిదాయక సోదరీమణులు, కుమార్తెలలో కొంతమందికి నా సోషల్ మీడియా ఖాతాలను అందిస్తున్నాను. ఈ మహిళలు వివిధ రంగాల్లో దేశాభివృద్ధికి, సమాజానికి విశేష కృషి చేశారు. వారి విజయగాథలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు ప్రేరణగా నిలుస్తాయి. ‘నారీ శక్తి‘ (మహిళా శక్తి) సాధించిన విజయాలను వేడుక చేసుకోవడానికి చేసుకోవడానికి మహిళా దినోత్సవం ఒక అవకాశం. ‘నారీ శక్తి‘ దేశంలోని ప్రతి రంగంలో ఎలా ప్రభావం చూపిస్తుందో మనం చూస్తున్నాం. గుజరాత్ కూడా ఇందుకు నిదర్శనం. రేపు నవసరిలో ‘నారీ శక్తి‘కి ప్రత్యేకించిన ఒక ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటాను. సూరత్ లో నేటి కార్యక్రమం కూడా మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, చాలా పెద్ద సంఖ్యలో తల్లులు, అక్కచెల్లెమ్మలు మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను.
మిత్రులారా,
సూరత్ ఒక మినీ భారత్గా, ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. జీవంతో నిండిన ప్రజలు నిండుగా జీవించే ప్రదేశం ప్రతిదీ అద్భుతంగా ఉండేందుకు అర్హమైనది. మరోసారి, లబ్ధిదారులందరికీ హృదయపూర్వక అభినందనలు! నా సూరత్ సోదర సోదరీమణులారా, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు! మళ్లీ కలుద్దాం. రామ్–రామ్!
ధన్యవాదాలు!
గమనిక: ప్రధాన మంత్రి ప్రసంగంలో కొన్ని భాగాలు గుజరాతీలో ఉన్నాయి. వాటి భావాన్ని తీసుకున్నాం.
***
The Surat Food Security Saturation Campaign Programme is a remarkable step in India's mission for food and nutrition security. https://t.co/sjZCJz5PkE
— Narendra Modi (@narendramodi) March 7, 2025
सूरत में जो खाद्य सुरक्षा Saturation अभियान चलाया गया है...ये देश के दूसरे जिलों के लिए भी प्रेरणा बनेगा: PM @narendramodi pic.twitter.com/OHkU3L7Z2J
— PMO India (@PMOIndia) March 7, 2025
हमारी सरकार गरीब की साथी बनकर हमेशा उसके साथ खड़ी है: PM @narendramodi pic.twitter.com/OvfABC2ACZ
— PMO India (@PMOIndia) March 7, 2025
विकसित भारत की यात्रा में पौष्टिक भोजन की बड़ी भूमिका है: PM @narendramodi pic.twitter.com/MOaRB2Kknf
— PMO India (@PMOIndia) March 7, 2025
मुझे विश्वास है कि ‘सबका साथ सबका विकास’ की स्पिरिट को आत्मसात करने वाले हमारे सूरत का खाद्य सुरक्षा सैचुरेशन अभियान देश के दूसरे जिलों के लिए भी प्रेरणा बनेगा। pic.twitter.com/wLQ18IX7Cu
— Narendra Modi (@narendramodi) March 7, 2025
हर परिवार को पर्याप्त पोषण देने के अपने लक्ष्य की ओर हम तेजी से आगे बढ़ रहे हैं, ताकि कुपोषण और एनीमिया जैसी बड़ी समस्याओं से देश मुक्त हो सके। pic.twitter.com/UBxKyruHqn
— Narendra Modi (@narendramodi) March 7, 2025
बीते एक दशक में हमने अपने गरीब भाई-बहनों को सशक्त बनाने के लिए निरंतर मिशन मोड पर काम किया है, जिससे उनका जीवन बहुत आसान हुआ है। pic.twitter.com/O5tMe2FED8
— Narendra Modi (@narendramodi) March 7, 2025