ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర క్యాబినెట్.. అస్సాంలోని నామ్ రూప్లో ఉన్న బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్ సీఎల్) ప్రాంగణంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో కొత్తగా బ్రౌన్ఫీల్డ్ అమ్మోనియా–యూరియా కాంప్లెక్సు ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,601.40 కోట్లు. నూతన పెట్టుబడి విధానం–2012 (2014 అక్టోబర్ 7న సవరణలు చేశారు) ప్రకారం జాయింట్ వెంచర్ ద్వారా 70:30 రుణ ఈక్విటీ నిష్పత్తితో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నామ్ రూప్–IV ప్రాజెక్టును 48 నెలల్లో ప్రారంభించాలని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీనితోపాటు.. ప్రభుత్వ సంస్థల విభాగం (డీపీఈ) మార్గదర్శకాలలో సూచించిన పరిమితుల సడలింపులో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) ఈక్విటీ భాగస్వామ్యం 18 శాతాన్ని, అలాగే నామ్ రూప్– IV ఫెర్టిలైజర్ ప్లాంటు ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించడం కోసం మంత్రి వర్గాల సమన్వయ కమిటీ ఏర్పాటును కూడా క్యాబినెట్ ఆమోదించింది.
ప్రతిపాదిత జాయింట్ వెంచర్ లో ఈక్విటీ నమూనా కింది విధంగా ఉండనుంది:
(i) అస్సాం ప్రభుత్వం: 40%
(ii) బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీవీఎఫ్ఎస్ఎల్): 11%
(iii) హిందుస్థాన్ ఉర్వరక్, రసాయన్ లిమిటెడ్ (హెచ్ యూఆర్ఎల్): 13%
(iv) నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్): 18%
(v) ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్): 18%
ప్రత్యక్ష ఆస్తుల స్థానంలో బీవీఎఫ్ఎస్ఎల్ ఈక్విటీ వాటా ఉంటుంది.
ఈ ప్రాజెక్టు దేశంలో, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో దేశీయంగా యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈశాన్య ప్రాంతం, బీహార్, పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లలో యూరియా ఎరువులకు పెరుగుతున్న డిమాండును ఇది తీరుస్తుంది. నామ్ రూప్–IV యూనిట్ ను నెలకొల్పడం ద్వారా తక్కువ ఇంధనంతోనే మరింత ఎక్కువగా ఫలితాలను సాధించవచ్చు. ఇది ఈ ప్రాంత ప్రజలకు అదనంగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను అందిస్తుంది. యూరియా విషయంలో దేశం స్వావలంబన సాధించాలన్న లక్ష్యాన్ని సాధించడంలో ఇది దోహదపడుతుంది.
***