Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోవిడ్-19 వ్యతిరేకంగా భారత్ పోరాటసమయంలో నాలుగు వారాల్లో నాలుగోసారి జాతి నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.


మే నెల 3ఆ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రకటన. 

అధిక ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోనూ, హాట్ స్పాట్ ప్రాంతాల్లోనూ నిరంతర నిఘా. 

తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని ఆంక్షల సడలింపు. 

రేపు సవివరమైన మార్గదర్శకాలు జారీ చేయనున్న ప్రభుత్వం. 

వృద్దులకు రక్షణ, సామాజిక దూరం, లాక్ డౌన్ వంటివి విధిగా పాటించడంతో పాటు 7 విషయాలలో మద్దతు కోరిన ప్రధానమంత్రి.  
 
2020 మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రకటించారు.  ఇంతకు ముందు ప్రకటించిన లాక్ డౌన్ 2020 ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. 

కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోడంపై జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, అనేక రాష్ట్రాలు, నిపుణులు, దేశ ప్రజల సూచనలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.   
 
ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు జాగురూకతతో ఉంటూ, సామాజిక దూరాన్ని విధిగా పాటించాలని కోరారు. 

తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలు ప్రారంభించడానికి 2020 ఏప్రిల్ 20వ తేదీ నుండి అనుమతినిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

” ఏప్రిల్ 20వ తేదీ వరకు, ప్రతి పట్టణం, ప్రతి పోలీసు స్టేషను, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం పరిధిలో  లాక్ డౌన్ ఎంత పటిష్ఠంగా అమలు చేసిందీ పర్యవేక్షిద్దాం. ఇందులో విజయం సాధించి, హాట్ స్పాట్ విభాగంలో లేని ప్రాంతాల్లో, ఏప్రిల్ 20వ తేదీ నుండి కొన్ని ఎంపిక చేసిన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది”. – అని ప్రధానమంత్రి చెప్పారు. 

” అయితే, అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించినందువల్ల, కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు తేలితే,  అనుమతులను వెంటనే ఉపసంహరించడం జరుగుతుంది” – అని ఆయన హెచ్చరించారు. 

ఈ విషయంలో, సవివరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రేపు విడుదల చేస్తుంది. 

తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పేదలు, రోజు వారీ కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సడలించడం జరుగుతుందని, ఆయన చెప్పారు. 

“రోజుకూలీలు, దినసరి ఆదాయంలేనిదే పూటగడవని వారంతా నా కుటుంబసభ్యులే.  నాకున్న ప్రాథమ్యాల్లో మొట్టమొదటిది వారి జీవితాల్లో కష్టాలు తొలగించడమే!  ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద సాధ్యమైనంత వరకూ వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  కొత్త మార్గదర్శకాల రూపకల్పనలో వారి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం” అని ఆయన వివరించారు. 

బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఈరోజు ప్రధానమంత్రి నివాళులర్పిస్తూ, మీరు ఎదుర్కొన్న కష్టాలు నాకు తెలుసు, కొంత మంది ఆహారం కోసం కష్టాలు పడ్డారు, మరి కొంత మంది ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళడానికి, చాల మంది తమ ఇళ్లకూ, కుటుంబాలకూ  దూరంగా ఉండవలసి వచ్చినందుకూ ఇబ్బంది పడుతున్నారు.  ఏది ఏమైనప్పటికీ మీదేశం కోసం- క్రమశిక్షణగల సైనికుల్లాగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మన రాజ్యాంగంలో “భారత పౌరులమైన మేము” అంటూ మనం చాటుకున్న ప్రజాశక్తి ఇదే! ” అని ప్రధానమంత్రి అన్నారు. 

దేశంలో ఒక్క కోవిదు-19 కేసు కూడా నమోదు కాక ముందే భారతదేశం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రాధమిక దశలోనే  అంతర్జాతీయ ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించడం, వారిని 14 రోజులపాటు తప్పనిసరిగా ఐసోలేషన్ లో ఉంచడంతో పాటు,  పెద్ద పెద్ద దుకాణ సముదాయాలు, క్లబ్బులు, వ్యాయామశాలలు వంటివి మూసి వేశామని ఆయన అన్నారు.  అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించామని ప్రధానమంత్రి చెప్పారు. 

కోవిడ్ ప్రభావానికి లోనైన ప్రపంచంలోని ఇతర ధనిక, శక్తివంతమైన దేశాలతో పోలిస్తే, భారతదేశం చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు. 

” ఒక నెల, నెలన్నర ముందు, చాలా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి సుమారుగా భారతదేశంతో సమానంగానే ఉంది. అయితే, ఈరోజు, ఆ దేశాల్లో, కరోనా కేసులు, భారతదేశం కంటే 25 నుండి 30 రేట్లు అధికంగా ఉన్నాయి. ఆ దేశాల్లో వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.  భారతదేశం, వేగంగా, నిర్ణయాత్మక చర్యలతో, సంపూర్ణ, సమగ్ర విధానాన్ని అవలింబించకపోతే, ఈరోజు భారతదేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ” – అని ఆయన చెప్పారు. 

లాక్ డౌన్ ప్రకటించడం వలన భారదేశం ప్రయోజనం పొందింది. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్ధిక ఇబ్బందులను పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల  దేశంలో అనేక జీవితాలను రక్షించగలిగాము అని ఆయన అన్నారు. 

” కేవలం ఆర్ధిక పరంగానే ఆలోచిస్తే,  ఎటువంటి అనుమానం లేకుండా ఇది ఇప్పుడు ఒక ఖరీదైన నిర్ణయమే;  కానీ, భారత పౌరుల ప్రాణాల విషయానికి వస్తే, ఈ  విషయంలో ఎటువంటి పోలిక, రాజీ లేదు.  మనకున్న పరిమితమైన వనరుల మధ్య మనం తీసుకున్న ఈ చర్య ఈ రోజు మొత్తం ప్రపంచానికే ఒక చర్చనీయాంశమైంది.” – అని ఆయన వివరించారు. 

మందులు, ఆహారం తో పాటు ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన దేశప్రజలకు భరోసా ఇచ్చారు.  ఆరోగ్య మౌలిక సదుపాయాల రంగాన్ని మరింత పటిష్టపరుస్తామని కూడా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. 

“కరోనా వైరస్ పరీక్షల కోసం జనవరిలో కేవలం కేవలం ఒక ప్రయోగశాల మాత్రమే ఉండగా, ఇప్పుడు మనకు 220 కంటే ఎక్కువగా ప్రయోగశాలలు ఉన్నాయి.  ప్రతి 10,000 మందికీ 1,500-1,600 పడకలు అవసరమని ప్రపంచానుభవం చెబుతోంది.  కానీ, భారతదేశం లో ఈ రోజున మనం  లక్ష పడకలను  సిద్ధం చేశాము.  అంతేకాదు-  కేవలం కోవిడ్‌ చికిత్స కోసం 600 ఆసుపత్రులను ప్రత్యేకంగా కేటాయించాము.  మనం ఇలా అనుకుంటున్న సమయంలోనే,  ఈ సదుపాయాలు మరింత వేగంగా పెరుగుతుంటాయి కూడా!” – అని ప్రధానమంత్రి తెలియజేసారు. 

ఈ మహమ్మారిని తిప్పికొట్టడానికి ఏడు సూత్రాలు పాటించాలని ప్రధానమంత్రి పౌరులను కోరారు. 

ముందుగా – మీ ఇళ్లలోని పెద్దలు.. ప్రత్యేకించి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపట్ల అత్యంత జాగ్రత్త వహించండి.  

రెండు – లాక్ డౌన్ లో ‘లక్షణరేఖ’కు పూర్తిగా కట్టుబడండి. సామాజిక దూరం పాటించండి. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులు తప్పకుండా ధరించండి.

మూడు – మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించండి. 

నాలుగు – కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం ‘ఆరోగ్య సేతు’ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతోపాటు ఇతరులనూ అందుకు ప్రోత్సహించండి.

ఐదు  –   మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాల యోగక్షేమాలను పట్టించుకోండి. ప్రత్యేకించి వారి ఆహార అవసరాలు తీర్చడానికి ప్రయత్నించండి.

ఆరు – మీ వ్యాపారాలు, పరిశ్రమలలో పనిచేసేవారిపై కరుణతో మెలగండి. వారిలో ఎవరికీ జీవనోపాధి లేకుండా చేయవద్దు.

ఏడు – కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది వంటి మన జాతీయ యోధులను గౌరవించండి. 

*****