ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 4) మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు బడ్జెట్ అనంతర (పోస్ట్ బడ్జెట్) వెబినార్లలో పాల్గొంటారు. వృద్ధికి చోదకశక్తిగా ఎంఎస్ఎంఇ; తయారీ, ఎగుమతులు, అణుశక్తి మిషన్లు; నియంత్రణ, పెట్టుబడులు, వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన సంస్కరణలపై ఈ వెబినార్లు జరుగుతాయి. ఈ సందర్భంగా హాజరైన వారి నుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
భారత పారిశ్రామిక, వాణిజ్య, ఇంధన వ్యూహాలపై చర్చించడానికి ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య నిపుణులకు ఈ వెబినార్లు ఒక సహకార వేదికను అందిస్తాయి. విధానాల అమలు, పెట్టుబడుల సౌలభ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, బడ్జెట్ ప్రతిపాదనలను నిరాటంకంగా అమలు చేసేలా చూడటంపై ఈ చర్చలు దృష్టి సారించనున్నాయి. ఈ వెబినార్లలో ప్రైవేటు రంగ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు, విషయ నిపుణులను భాగస్వాములను చేసి బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేయనున్నారు.
***